తిరుమల: దీపావళి పండుగ సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా మొత్తం 21,974 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించారు.
భక్తుల రద్దీ కారణంగా టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పట్టిందని అధికారులు చెప్పారు. పండుగ సందర్భంగా భక్తులు భారీగా రావడంతో శ్రీవారికి హుండీ ఆదాయం కూడా భారీగా వచ్చింది. భక్తులు ఒక్కరోజే శ్రీవారి హుండీలో రూ.3.58 కోట్లు వేశారు. కాగా, దీపావళి పండుగ సందర్భంగా ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. స్వామి వారిని, అమ్మవారిని రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.