తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. విద్యుద్దీపాలు, వివిధ పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. వెంకన్న రూపంలో ఉన్న శ్రీరాముడిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తిరుమలలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.
సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. ఆలయం నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు ఊరేగింపు చేరుకున్నది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్బాబుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఓడలో సుఖాశీనుడైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తున్నది. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.