అమరావతి : తిరుమల లడ్డూ వివాదాన్ని (Laddu affair ) కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. విశాఖలో పర్యటిస్తున్న ఆమె బుధవారం ఎయిర్పోర్టు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని గాంధీ జయంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి దీక్షలో పాల్గొన్నారు.
ఆమె మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ వివాదంపై ముందుగా తామే స్పందించి సీబీఐ విచారణ కోరామని గుర్తు చేశారు. ఈ విషయంపై హోం శాఖ మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ఏపీ గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేశామన్నారు.
సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో సిట్ దర్యాప్తుపై సంతృప్తిగా లేదన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. లడ్డూ వివాదంపై ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని దానికి మతం రంగు పూస్తున్నారు ఎద్దేవా చేశారు.