తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 72,664 మంది భక్తులు దర్శించుకోగా 32.336 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
టీటీడీకి రూ.2.5 లక్షల విలువైన నానో ఫెర్టిలైజర్స్ విరాళం
హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫెర్టిలైజర్స్ తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తమ నూతన ఉత్పత్తులైన నానో ఫెర్టిలైజర్స్ను శ్రీవారికి విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ గార్డెన్ కార్యాలయం వద్ద గురువారం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జి.వి.సుబ్బా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర్ సుబ్రమణ్యం రూ.2. 5 లక్షలు విలువైన నానో డిఏపీ, ఆక్యూమిస్ట్ కాల్షియమ్, గార్డిన వంటి నానో ఫెర్టిలైజర్స్ను టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులుకు అందచేశారు.
తమ కొత్త ఉత్పత్తులను మొదట శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని వారు వెల్లడించారు. కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్లు సత్యనారాయణ, మాదబ్ అధికారి, హరీష్ మాత, మార్కెటింగ్ అఫీసర్ మురళి పాల్గొన్నారు.