తిరుమల : తిరుమల ( Tirumala ) లో జగదీష్ నారాయణి విశ్రాంతి గృహాన్ని టీటీడీ చైర్మన్ (TTD Chairman) వైవి.సుబ్బారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన దాతలు ఓంప్రకాష్ అగర్వాల్, సునీతా అగర్వాల్ కలిసి చైర్మన్ను సత్కరించారు. రిసెప్షన్ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్డీ రామకృష్ణ, వీజీఓలు బాలిరెడ్డి, గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక సత్రాల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష
తిరుమలలోని కర్ణాటక సత్రాల అభివృద్ధి పనుల పురోగతిపై టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, కర్ణాటక రాష్ట్ర రవాణా, దేవాదాయ శాఖల మంత్రి రామలింగారెడ్డితో కలిసి బుధవారం అన్నమయ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. ఈ ఏడాది డిసెంబర్లోగా పనులు పూర్తవుతాయని వెల్లడించారు.
కర్ణాటక స్టేట్ ఛారిటీస్ ప్రతినిధులు తమ డిజైన్లతో పాటు బ్లాక్ ఎ, బి భవనాలు, కల్యాణ మండపంలో గల గదుల వివరాలతో కూడిన ప్రణాళికను తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేసేందుకు అవసరమైన డిజైన్లను సకాలంలో అందించాలని కర్ణాటక రాష్ట్ర అధికారులను టీటీడీ ఈవో కోరారు. కర్ణాటక ప్రభుత్వం 2021 డిసెంబర్ 27న రూ.220 కోట్ల వ్యయంతో కర్ణాటక సత్రాల అభివృద్ధి కోసం తిరుమలలో గల స్థలాన్ని టీటీడీకి అప్పగించింది. ఈ భవనంలో మొత్తం 242 గదులతో రెండు బ్లాకులు, 12 డార్మిటరీలు, ఒక కల్యాణమండపం, ఒక సూట్ బ్లాక్, 86 గదులతో కూడిన పాత బ్లాక్ ఉన్నాయని అధికారులు వివరించారు.