TTD | తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ( TTD Hundi ) కి కాసుల వర్షం కురుస్తోంది. మార్చి నెలలో కూడా భారీగా ఆదాయం సమకూరింది. గతేడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీ నెల రూ. 100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోంది. ఈ క్రమంలో మార్చి నెలలో తిరుమల హుండీ( Tirumal Hundi ) ఆదాయం రూ. 120.29 కోట్లు లభించింది. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగిసింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 1,520.29 కోట్లు లభించిందని టీటీడీ అధికారులు ( TTD Officials ) తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ నెలా స్వామివారి ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2022 సంవత్సరంలో అంటే జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ 1,450 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు. అత్యధికంగా గతేడాది ఆగస్టు నెలలో 140.34 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. 2021 (జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు) సంవత్సరంలో 1.04 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా రూ. 833.41 కోట్లు ఆదాయం సమకూరింది.
టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ రూ.4,411.68 కోట్లు
తిరుమల దేవస్థానంలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగరుబత్తీల రెండో యూనిట్ ప్లాంట్ను ప్రారంభించారు. తిరుపతిలోని ఎస్వీ గో సంరక్షణశాలలో ఈ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగరుబత్తీల రెండో యూనిట్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రతీరోజూ దేవస్థానంకు అవసరమయ్యే 3 వేల నుంచి 4 వేల లీటర్ల పాలను స్థానికంగానే ఉత్పత్తి చేయాలనుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గోవులకు అవసరమయ్యే దాణాకోసం రూ.11 కోట్లతో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మించడం జరిగిందని తెలిపారు.