తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 9 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Sarvadarsanam) 12 గంటల సమయం పడుతుందని తిరుమల,తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 73,156 మంది భక్తులు దర్శించుకోగా 28,175 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు వచ్చిందని వివరించారు.
జూన్ 29 నుంచి తాళ్లపాకలోని సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతిలోని తాళ్లపాక (Tallapaka )శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahamotsavms) జూన్ 29 నుంచి జులై 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు ఒక రోజు ముందు జూన్ 28వ తేది సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. జూన్ 29న ఉదయం 7.38 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయని, సాయంత్రం హంసవాహన సేవ, జూన్ 30, జులై 1, 2, 3వ తేదీల్లో ఉదయం పల్లకీ(Pallaki) ఉత్సవం నిర్వహిస్తామన్నారు.
జూన్ 30న సాయంత్రం చంద్రప్రభ వాహనం, జులై 1న సాయంత్రం చిన్నశేష వాహనం, 2న సాయంత్రం సింహ వాహనం, 3న సాయంత్రం నంది వాహనసేవ జరుగుతాయని వెల్లడించారు. జులై 4న సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుందన్నారు. జులై 5న సాయంత్రం పల్లకీ సేవ, 6న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం, 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని తెలిపారు.