తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరి కిటకిటలాడుతుంది. దీంతో కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు(Compartments) నిండిపోయి నారాయణగిరి గార్డెన్ వరకు క్యూలైన్లో వేచియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు(Ttd Officers) వివరించారు. నిన్న స్వామివారిని 59, 734 మంది భక్తులు దర్శించుకోగా 30, 654 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.52 కోట్లు వచ్చిందని తెలిపారు.
సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఘడియలు ఆదివారం తెల్లవారుజామున 12.34 గంటలకు ప్రారంభం కావడంతో స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావైని నిర్వహించారు. ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయని అప్పటివరకు సుప్రభాతం సేవ ఉండదని , భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.