తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు (Compartments) భక్తులతో నిండి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న 71,721 మంది భక్తులు దర్శించుకోగా 32,078 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( Hundi Income) రూ.3.88 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
జూలై 26న తిరుమలలో పల్లవోత్సవం
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 26వ తేదీన పల్లవోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారని తెలిపారు.కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారని వివరించారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోందని తెలిపారు.