తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయాన్ని(Anandanilayam ) వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా, భద్రతాధికారి నరసింహ కిషోర్ తెలిపారు. టీటీడీ(TTD) నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోనికి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం నేరమని అన్నారు.
నిన్న (ఆదివారం) తిరుమలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడిన నేపథ్యంలో, దాదాపు రెండు గంటల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. అదే సమయంలో సదరు భక్తుడు పెన్ కెమెరా(Pen Camera) ద్వారా వీడియో చిత్రీకరించినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. సీసీటీవీ(CC TV)ల ద్వారా సదరు భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు.