తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోవిందా నామస్మరణతో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 71,387 మంది భక్తులు దర్శించుకోగా 24,701 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi income) రూ. 5.71 కోట్లు వచ్చిందని వివరించారు.
మార్చి 4 నుంచి అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి 7వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 4న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, 5న ఉదయం 7.45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వవాహనసేవ, 6న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు. 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వసంతోత్సవం, చక్రస్నానం, పూర్ణాహుతి, 8న సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుందని వెల్లడించారు .