తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 17 కంపార్ట్మెంట్లలో ( Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
ఆర్జిత టికెట్లు పొందిన వారికి 4 గంటల్లో దర్శనం కలుగుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 61,904 మంది భక్తులు దర్శించుకోగా 31,205 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా సీసీ కెమెరాలు
భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దుకాణాల నిర్వాహకులతో ఈవో సమావేశం నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలిపిరి నడక మార్గంలో తినుబండారాలు విక్రయించే దుకాణాల్లో పండ్లు, కూరగాయలు విక్రయించరాదని సూచించారు. భక్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువులకు తినిపించడం వల్ల వాటి రాక పెరుగుతోందని, ఈ జంతువుల కోసం క్రూరమృగాలు అటువైపు వచ్చి భక్తులపై దాడి చేస్తున్నాయని వివరించారు.