తిరుమల: తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆరు కంపార్ట్మెంట్లలో దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) లభిస్తుందని టీటీడీ అధికారులు(Ttd officials) తెలిపారు. నిన్న స్వామివారిని 56,680 మంది భక్తులు దర్శించుకోగా 18,947 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.54 కోట్లు వచ్చిందని వివరించారు.
ఏప్రిల్ 26, 27వ తేదీల్లో శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయ బాలాలయ సంప్రోక్షణ
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారి పల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ 26, 27వ తేదీల్లో బాలాలయ సంప్రోక్షణ(Mahasamprokshanam ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ‘ బాలాలయం ’ చేపడతారని ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.
అనంతరం మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారని వివరించారు. ఏప్రిల్ 26న సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తు హోమం, మేదిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ, 27న ఉదయం 7.30 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల పూజ, పూర్ణాహుతి, సంప్రోక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు.