అమరావతి : కాకినాడ జిల్లాలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత 15 రోజులుగా కునుకులేకుండా చేస్తున్న పులి జాడ తెలుసుకునేందుకు అటవి అధికారులు, సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సీసీ కెమెరాల ఏర్పాటు, గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పులిని బంధించడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా నిన్న కూడా జిల్లాలోని ప్రత్తిపాడు మండలం పొదురుపాక వద్ద పులి సంచారాన్ని పసిగట్టారు. పొదురుపాకలో ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చి కొంతమేర తినేసింది.
శరభవరం సమీపంలో పులి నుంచి రెండు గేదెలు తప్పించుకున్నాయి. పులి సంచారంతో ఒమ్మంగి, పొదురుపాక, పాండువలపాలెం, పోతులూరు, శరభవరం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. పలుచోట్ల పులి బోనులు ఏర్పాటు చేసిన అధికారులు రాత్రివేళల్లో ఒంటరిగా ఎవరూ భయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పులిని త్వరగా బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.