అమరావతి : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వరంగల్కు చెందిన ఓ కుటుంబం బెంగళూరు నుంచి హైదరాబాద్కు కారులో వస్తుండగా సత్యసాయి జిల్లాలోని కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లి వద్ద కారు డివైడర్ను ఢీకొట్టింది.
దీంతో కారులో ఉన్న వరంగల్ ఎల్లంబజారుకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించారు. మృతుల్లో గోపీనాథ్, ఆయన భార్య రమ్య, తల్లి తారకేశ్వరి ఉన్నారు. దంపతుల పిల్లలు ఇద్దరు గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.