అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఓ బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని(24), ఏటికొప్పాకకు చెందిన ఇల్లకు గోవిందు (25), పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (16) పెయింటర్లుగా ఉపాధి పొందుతున్నారు. ఈ ముగ్గురు పురుషోత్తపురంలోని అమ్మవారి జాతర చూసేందుకు గురువారం రాత్రి 10 గంటలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా దుర్గాప్రసాద్ను దించేందుకు పోతిరెడ్డిపాలెం గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలోనే గ్రామ కూడలి వద్ద వీరి బైక్ను విజయవాడ వైపు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.