హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో విషాదం చోటుచేసుకొన్నది. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన ఓ యువకుడు మృతి చెందగా, కర్రల సమరంలో సుమారు 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. దసరా పర్వదినాన దేవరగట్టు గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరస్వామి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. విగ్రహాలను దక్కించుకోవడానికి 3 గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు.
తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జరిగిన ఈ కర్రల సమరంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఓ చేతిలో కర్ర, మరో చేతిలో దివిటీలు, మది నిండా భక్తిభావంతో పెద్ద ఎత్తున భక్తులు ఈ సమరంలో పాల్గొన్నారు. నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి మరికొన్ని గ్రామాల ప్రజల మధ్య ఈ కర్రల సమరం సాగింది. పలువురు విచక్షణారహితంగా కొట్టుకోవడంతో సుమారు 100 మందికిపైగా గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులు ఆలూరు ప్రభుత్వ దావాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ వేడుకలను చూసేందుకు కొందరు సమీపంలోని చెట్టుపైకి ఎక్కారు. ప్రమాదవశాత్తూ కొమ్మలు విరిగిపడటంతో గణేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు.