ఏలూరు : పంట కాల్వలో కారు బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరు-అర్ధవరం గ్రామాల మధ్య సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. మృతులంతా మహిళలే. వీరంతా భీమవరం కొత్త బస్టాండ్ ప్రాంతానికి చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
భీమవరం కొత్త బస్టాండ్ సమీపంలో నివసించే మహబూబ్ బాషా బంధువుల వివాహం ఏలూరులో జరిగింది. ఈ వివాహానికి హాజరయ్యేందుకు అమరజహాన్ (50), మహ్మద్ షంషాద్ (55), ఫాతిమా జహర్బీ (45) తోపాటు అమర్జహాన్ కుమారుడు కమల్ బాషా, ఎండీ రహీమాలు కారులో బయల్దేరారు. వివాహం అనంతరం తాడేపల్లిగూడెంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు కారులో భీమవరం బయలుదేరారు. వల్లూరు వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొని పంట కాల్వలోకి దూసుకెళ్లింది.
స్థానికులు వెంటనే కారులో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కారు నీటిలో సగం వరకు మునిగిపోవడంతో కారులో ఉన్న అమర్జహాన్, మహ్మద్ షంషాద్, ఫాతిమా జహర్బీ అనే ముగ్గురు మహిళలు ఊపిరాడక కారులోనే చనిపోయారు. కారు నడుపుతున్న అమర్జహాన్ కుమారుడు కమల్బాషా, ఎండీ రహీమాలను స్థానికులు రక్షించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.