విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) ఆస్తులను కబ్జా చేసేందుకే బీజేపీ (BJP) కుట్రలు చేస్తున్నదని ఏపీ బీఆర్ఎస్ (AP BRS) అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) అన్నారు. ప్రజల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపుతున్నదని విమర్శించారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ (Privatisation) నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ముమ్మరంచేసింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని (Visakhapatnam) కూర్మన్నపాలెం జంక్షన్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి దీక్షకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, ఇతర నేతలు మద్దులు తెలిపారు. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, స్టీల్ప్లాంట్ నిర్వాసితులు, ఉద్యమకారులతో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ను భావితరాలకు ఇచ్చే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై రాజకీయాలను అడ్డుకొని తీరుతామన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక క్రూరమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి నెట్టివేయబడిన సంస్థ అని తెలిపారు. ప్లాంటు కార్మికులు కష్టపడి కంపెనీ ఆస్తులను రూ.3 లక్షల కోట్లకు పెంచారన్నారు. విశాఖ ప్లాంటుకు గనుల కేటాయింపు జరగాలని వెల్లడిచారు. నిర్వాసితుల స్థలాలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, విశాఖ ఉక్కును కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరమని ఉద్యోగాల సంఘాల నాయకులు తెలిపారు. ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ఆశాదీపం సీఎం కేసీఆరేనని (CM KCR) స్పష్టం చేశారు.