అమరావతి : ఏపీలో వరద ప్రభావిత జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి బాధితులకు సహాయ సహకారాలు అందించి అండగా నిలువాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు తక్షణమే గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత జిల్లాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రానవసరం లేదని స్పష్టం చేశారు. నెల్లూరు,చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో ఉచితంగా 25 కిలోల బియ్యం, కేజీ కందపప్పు, కేజీ ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, లీటర్ వంటనూనే అందించాలని పేర్కొన్నారు.
వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని, పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి సాగుచేసుకునేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు తోడుగా ఉండాలని వివరించారు. తమ ప్రాంతాల్లోనే ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లాల ఇన్చార్జి మంత్రులు , ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీచేశారు.