పెరవలి: ఎప్పుడెప్పుడు నగలు, నగదు దొరుకుతాయా? అంటూ ఆశతో చాలా మంది ఉంటుంటారు. తమకు దొరికిన విలువైన వస్తువులను పోగొట్టుకున్న వారికి అప్పగించకుండా చాలా మంది మిన్నకుంటారు. విలువైన వస్తువులను పోగొట్టుకున్న వారి బాధను దొరికిన వారు పట్టించుకోరు. అయితే, ఈ వ్యక్తి మాత్రం చేసేది ఆటోడ్రైవర్ ఉద్యోగమైనా.. ఆశలకు పోకుండా నిజాయితీగా వ్యవహరించారు. తన ఆటోలో మరిచిపోయిన బంగారు నగలు, నగదును ప్రయాణికురాలికి అందజేసి.. తన నిజాయితీని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి గ్రామానికి చెందిన పడాల స్వప్న శనివారం ఉదయం పెనుగొండ వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆమె హ్యాండ్ బ్యాగులో 10 సవర్ల బంగారు నగలు, నగదు ఉన్నాయి. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బ్యాగును ఆటోలో వదిలి వెళ్లిపోయింది. ఆటోలో మహిళ వదిలి పెట్టిన బ్యాగును గమనించిన డ్రైవర్ అడపా రమేష్.. అక్కడే కొద్దిసేపు ఎదురుచూశాడు. ఎవరూ రాకపోవడంతో పెరవలి పోలీస్ స్టేషన్కు వెళ్లి నగలు, నగదు ఉన్న హ్యాండ్ బ్యాగును పోలీసులకు అప్పగించారు. బ్యాగ్ పోగొట్టుకున్న మహిళ.. తాను ఎక్కిన ఆటో కోసం వెతుకుతుండగా.. పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు అక్కడే ఉన్న కొందరు ఆటో డ్రైవర్లు చెప్పారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన స్వప్నకు.. డ్రైవర్ రమేష్ చేతుల మీదుగా బ్యాగును పోలీసులు అప్పగించారు. బ్యాగులోని నగలు, నగదును చూసుకుని స్వప్న ఎంతో సంతోష పడింది. ఆటో డ్రైవర్ రమేష్ నిజాయితీని స్థానిక పోలీసులు, గ్రామస్థులు కొనియాడారు.