అమరావతి : గుంటూరు జిల్లా దుగ్గిరాలలో రేపు(గురువారం) జరుగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ , జనసేన ఎంపీటీసీలకు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. అధికార వైసీపీ పార్టీకి చెందిన నాయకులు తమ సభ్యులను బెదిరించడం గాని, కిడ్నాప్నకు గాని పాల్పడే అవకాశముందని ఆ రెండు పార్టీలకు చెందిన నాయకులు ఆందోళనకు గురవుతున్నారు.
దీంట్లో భాగంగా తమకు భద్రత కల్పించాలని స్థానిక డీఎస్పీకి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు. సభ్యులు ఈనెల 5న టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి దుగ్గిరాల ఎంపీపీ కార్యాలయానికి చేరుకునే వరకు భద్రత కల్పించాలని నాయకులు కోరారు.