అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతిపెద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar Statue) విజయవాడ(Vijayawada) లో ఆవిష్కరించింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 18.18 ఎకరాల స్థలంలో 206 అడుగుల ఎత్తులో 81 అడుగుల వేదిక మీద, 125 అడుగులతో అన్ని ఆధునిక హంగులతో కూడిన విగ్రహాన్ని ఏర్పాటుచేసింది.
ఇందుకు గాను ప్రభుత్వం 404.35 కోట్లను ఖర్చు చేసింది. విగ్రహానికి కాంస్యం 120 మెట్రిక్ టన్నులు, విగ్రహం లోపల నిర్మాణానికి 400 మెట్రిక్ టన్నుల స్టీల్ను, 2200 టన్నుల శాండ్ స్టోన్ , పీఠంపై జీ+2 గదులు నిర్మాణం,అంబేద్కర్ జీవిత విశేషాలతో ఎక్స్ పీరియడ్స్ సెంటర్, 2 వేల మందికి సరిపడా కన్వెన్షన్ సెంటర్, బౌద్ద వాస్తు శిల్ప కళలోని కాలచక్ర మహా మండపం డిజైన్తో పీఠాన్ని నిర్మించడం విశేషం.
దాదాపు మూడేళ్ల పాటు కొనసాగిన పనులు పూర్తికావడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ( CM Jagan) అంబేద్కర్ భారీ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని శుక్రవారం ఆవిష్కరించి జాతీకి అంకితం చేశారు. ఈ విగ్రహ స్థలానికి సామాజిక న్యాయ మహా శిల్పంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన లేజర్ షో (Laser show) విశేషంగా ఆకట్టుకుంది.
అంబేద్కర్ జీవిత విశేషాలతో పాటు ఏపీకి చెందిన ప్రముఖ స్థలాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో కూడిన లేజర్ షోను ప్రదర్శించారు. ఈ విగ్రహం దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల ప్రజలకు కూడా కనబడుతుందని, ఈ ప్రాంతం టూరిస్టు స్పాట్గా రూపుదిద్దుకునే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది .