నర్సంపేట, మే 9: కరోనా పాజిటివ్ వచ్చిన వారు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ సూచించారు. నర్సంపేటలో నిర్వహిస్తున్న ఇంటింటా సర్వేను ఆదివారం ఆమె పరిశీలించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటికే వచ్చి మందులు ఇస్తారన్నారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ హోం ఐసొలేషన్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ శాతం తగ్గకుండా రోజూ పల్స్ ఆక్సీమీటర్తో చెక్ చేసుకుంటే మంచిదని సూచించారు.
శరవేగంగా ఇంటింటా సర్వే
నర్సంపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా సర్వే మండలంలో శరవేగంగా కొనసాగుతున్నది. ఆదివారం మండలంలోని భోజ్యానాయక్తండా, గురిజాల, చిన్న గురిజాల, జీజీఆర్పల్లి, ఆకులతండా, నర్సింగాపురం, మహేశ్వరం, రాజేశ్వర్రావుపల్లి, చంద్రయ్యపల్లిలో సర్పంచ్లు భూక్యా లలిత, గొడిశాల మమత, గడ్డం సుజాత, తుత్తూరు కోమల, రాము, రవీందర్, కవిత, యువరాజ్, లావణ్య ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సర్వే చేశారు. ఈ సందర్భంగా జ్వరపీడితులకు సంబంధించిన వివరాలు సేకరించారు.
కరోనా లక్షణాలున్న వారికి మందుల పంపిణీ
శాయంపేట: మండలంలో 10,803 గృహాలు ఉండగా, వందశాతం సర్వేను ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పూర్తి చేశారు. కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. సర్వేలో కరోనా లక్షణాలున్న 395 మందిని గుర్తించారు. అప్పయ్యపల్లిలో 8, ఆరెపల్లిలో 6, ప్రగతిసింగారంలో 22, గంగిరేణిగూడెంలో 12, గట్లకానిపర్తిలో 47, గోవిందాపూర్లో 2, జోగంపల్లిలో 8, కాట్రపల్లిలో 11, కొప్పులలో 55, కొత్తగట్టుసింగారంలో 5, మైలారంలో 12, నర్సింహులపల్లిలో 14, నేరేడుపల్లిలో 20, నూర్జహాన్పల్లిలో 14, పత్తిపాకలో 47, పెద్దకోడెపాకలో 16, రాజుపల్లిలో 28, సాధన్పల్లిలో 1, శాయంపేటలో 20, సూరంపేటలో 16, తహార్పూర్లో 21, వసంతాపూర్లో 10 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని వైద్య సిబ్బంది తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు, నొప్పులు ఉన్న వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు వైద్యాధికారి నాగశశికాంత్ తెలిపారు.
పూర్తయిన ఇంటింటా సర్వే
చెన్నారావుపేట: మండలంలోని చెన్నారావుపేటలో మొత్తం 1072 ఇండ్లు, పాపయ్యపేటలో 745 ఇండ్లలో సర్వే పూర్తి చేశామని కార్యదర్శులు బాలకిషన్గౌడ్, శ్యామ్ తెలిపారు. దీంతో మండలంలో ఇంటింటా సర్వే వందశాతం పూర్తయింది. కార్యక్రమంలో వీఆర్ఏ కోరె శోభారాణి, ఆశ కార్యకర్తలు అడుప విజయ, బానోత్ సాలమ్మ, అంగన్వాడీ టీచర్లు ఈగ మంజుల, మొగిలి పుష్పలత పాల్గొన్నారు.