తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రంలో వరుస ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇటీవల డ్రోన్ సహాయంతో తిరుమల ఆలయాన్ని చిత్రీకరించిన విషయం సద్దుమణగక ముందే శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో చోరీ జరగడం కలకలం సృష్టిస్తుంది. స్వామివారి సన్నిధిలో దర్శనం అనంతరం భక్తులకు టీటీడీ 50 లడ్డూ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసింది.
36వ నంబర్గల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో రాత్రి కౌంటర్ బాయ్ నిద్రపోతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. కౌంటర్ లోని రూ. రెండు లక్షలను దోచుకెళ్లడంతో కౌంటర్ బాయ్ టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిర్ధారించుకున్న అధికారులు తిరుపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
లడ్డూ కౌంటర్ సహా పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఇదే నిందితుడు గతంలోనూ తిరుమలలో పలు చోరీలకు పాల్పడ్డాడని వెల్లడించారు.