తిరుమల : తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ (Special Investigation Team) దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. మూడో రోజు దర్యాప్తులో భాగంగా తిరుమల (Tirumala) లోని గోదాములు, పరిశోధనశాలలో పర్యటించారు. గోదాములకు(Godowns) వచ్చిన ట్యాంకర్ల నుంచి నెయ్యి నమూనాలు సేకరించారు. ల్యాబ్లో నాణ్యత పరీక్షల యంత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోదాముల్లో ముడిసరుకుల నాణ్యతను పరిశీలించారు. పిండి మర ప్రయోగశాలను సిట్ సభ్యులు పరిశీలించారు.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ( Sarvashresta Tripathi) తెలిపారు . తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు సిట్కు బదిలీ అయ్యిందని వెల్లడించారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామని చెప్పారు.
నివేదిక సమర్పించడానికి ఎలాంటి కాలపరిమితి లేదని అన్నారు. సిట్ బృందంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్దన్ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. శనివారం తిరుమలకు చేరుకున్న సిట్ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం లడ్డూలను తయారి చేసే పోటును సందర్శించారు. అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయి వివరాలు తీసుకున్నారు.