అమరావతి : ప్రజల జీవనప్రమాణాలు, పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛత, అభివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. వీటిని నగర, మున్సిపల్ పరిధిలో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు గాను నిధులను విడుదల చేస్తూ మార్గదర్శకాలను కచ్ఛితంగా అమలు చేస్తూ పనులు చేపట్టే సంస్థలకు ప్రతియేట అవార్డులను, రివార్డులను అందజేస్తుంది.
అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా పలు కార్పొరేషన్లను స్మార్ట్ సిటీ కింద కేంద్రం ఎంపిక చేసింది. ఏపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఒకడగు ముందుకు వేసి విశాఖ, తిరుపతి, ఏలూరు, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్లకు నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్లను నియమించింది. ఈ విషయం తెలుసుకున్న కేంద్రం సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు చెల్లవని గత డిసెంబర్లో ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసింది. చైర్మన్లతో రాజీనామాలు చేయించాలని స్పష్టం చేసింది.
జరిగిన తప్పును ఆలస్యంగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం చైర్మన్లు రాజీనామా చేయాలని ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్మార్ట్ సిటీ చైర్మన్గా పనిచేస్తున్న జి. వెంకటేశ్వరరావు, తిరుపతి స్మార్ట్ సిటీ చైర్పర్సన్ ఎన్ పద్మజ, కాకినాడు స్మార్ట్ సిటీ చైర్మన్ రాజుబాబు, ఏలూరు స్మార్ట్ సిటీ చైర్పర్సన్ బి. అఖిల తమ పదవులకు రాజీనామా చేశారు .