అమరావతి : బ్రతికి ఉన్నప్పుడు కానరాని దయ, కరుణాకటాక్షాలు చనిపోయిన తరువాత చూపించారు రెవెన్యూ అధికారులు. నిన్న చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో గుండెపోటుతో మృతి చెందిన రత్నం నాయుడు కుటుంబానికి ఎట్టకేలాగు రెవెన్యూ అధికారులు స్పందించి అతడి పేరు మీద పొలం కేటాయింపు హామీపత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
తనకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కొందరూ ఆక్రమించుకుని ఇళ్లను కట్టుకున్నారని తనకు పూర్తిస్థాయి పట్టాను ఇవ్వాలని కొన్ని సంవత్సరాలుగా రత్నంనాయుడు అనే రైతు రెవెన్యూకార్యాలయం చుట్టూ తిరుగు తున్నాడు. ప్రభుత్వం అందజేసిన స్థలం తనేదేనని కోర్టుకు వెళ్లి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకుని వచ్చినా కనుకరించని అధికారులు అతడిని కార్యాలయం చుట్టూ చచ్చేదాక తిరిగిపించుకున్నారు. రత్నంనాయు డుమూడు రోజులుగా రెవెన్యూ కార్యాలయం వద్దనే ఉంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నా చివరకు ఎవరూ అతడిని పట్టించు కోలేదు.
చివరిసారిగా నిన్న అధికారులతో కార్యాలయంలో మాట్లాడుతుండగానే ఆ రైతు ఒక్కసారిగా కుప్ప కూలి చని పోయాడు. ఈ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో భయపడ్డ రెవెన్యూ అధికారులు హుటాహుటి న రత్నం నాయుడు పేరుపై పట్టాకాగితం కుటుంబ సభ్యులకు అందజేసి చేతులు దులుపేసుకున్నారు.
న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
అధికారుల నిర్లక్ష్యం పట్ల ఇవాళ పెనుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షలు, రెండు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు అంత్యక్రియలు నిర్వహించబోమని పేర్కొన్నారు.