అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఇవాళ ఏపీ విభజన హామీలు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రత్యేక హోదా సాధనకు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నెల్లూరు కోర్టులో చోరీ జరిగితే దానిని ఉక్కు దొంగతనం కోసం వచ్చారంటూ స్వయానా పోలీసు అధికారి మాట్లాడం విచారకరమని అన్నారు.
నెల్లూరు కోర్టులో దొంగలు కేవలం కాకాణికి సంబంధించిన సామాగ్రి తీసుకువెళ్లడం వెనుక పెద్ద బాగోతం ఉందన్నారు. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ కాకుండా ఏపీలో ఇంట్లో పోలీస్ ఆఫీసర్స్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక దివ్యాంగురాలిపై సామూహిక లైంగిక దాడి జరిగితే బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇప్పటికైనా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి వైఖరిలో మార్పు రావాలని సూచించారు. వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం కోసం సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కూడా అడగడం లేదని ఎద్దేవా చేశారు.