అమరావతి: గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన సర్పంచుల (Sarpanches) పై పోలీసులు లాఠీచార్జి (Lathi charge) చేశారు. వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను వైసీపీ ప్రభుత్వం వాటిని దారిమళ్లించిందని, ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకే ఇవ్వాలని సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మంగళవారం ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి పిలుపునిచ్చింది.
వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కార్లలో పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ వచ్చిన సర్పంచులు నినాదాలు చేస్తూ అసెంబ్లీ(AP Assembly) పరిసర ప్రాంతాలకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సర్పంచులకు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. చివరకు పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఒక దశలో సర్పంచులు పోలీసులు కాళ్లు పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.
చివరకు సర్పంచులను పోలీసులు ఈడుకెళ్లి బస్సులో వేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. గ్రామ సచివాలయాలు, వాలంటర్లను సర్పంచుల ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ను ఉయ్యూరులో, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులను మందడంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.