అమరావతి : విశాఖలోని రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace) వినియోగంపై ప్రజాభిప్రాయ సేకరణ కంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం నేరమా? కాదా ? అనే విషయం ప్రజాకోర్టులో తేలి శిక్షించడమే సరైన నిర్ణయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu ) పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం చిన్నబోయే విధంగా గత వైసీపీ(YCP) పాలకులు రుషికొండ ప్యాలెస్ నిర్మించారని దుయ్యబట్టారు.
విశాఖలోని(Visaka) రుషికొండ భవనాలను శనివారం పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 500 కోట్లతో నిర్మించిన భవనాలను రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్రావు, పల్లా శ్రీనివాస్, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. దాదాపు గంటకు పైగా భవనాలను అనువణువునా పరిశీలించారు. సంబంధిత వివరాలను సీఎం అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నది ఆశ్చర్యం కలుగుతుందని, ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం,తన స్వార్థం కోసం ప్యాలెస్లు నిర్మించుకోవడం గుండె చెదిరిపోయే విషయాలని అన్నారు. రుషికొండ ప్యాలెస్ వాస్తవాలు బయట పెట్టడానికి మీడియా, పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, నేను, పవన్కల్యాణ్, బీజేపీ నాయకులు ప్రయత్నించిన సాధ్యం కాలేదని వివరించారు.
సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టారని విమర్శించారు. ప్రజాధనంతో రాజులు కూడా ప్యాలెస్ కట్టుకోలేదని అన్నారు. రుషికొండ ప్యాలెస్లు రాష్ట్రపతి, ప్రధాని విడిది కోసమని, పర్యాటక ప్రాంతమని బుకాయించి వారి పేరును బదనాం చేశారని ఆరోపించారు. గజపతి బ్లాక్లో కాన్ఫరెన్స్ గదులు నిర్మించారని ఇటువంటి వైట్హౌజ్లో(White House) గాని , భారత రాష్ట్రపతి(President) నివాసంలో కూడా లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జగన్ ఆంధ్రా ఎస్కోబార్
మంచినీళ్ల మాదిరిగా డబ్బులు ఖర్చు పెట్టిన ఆర్థిక నేరస్థుడు జగన్ ఆంధ్రా ఎస్కోబార్ అని అభివర్ణించారు. పేదల పేరు చెప్పి విలాసవంతమైన ప్యాలెసులు కట్టుకున్నాడని విమర్శించారు. ప్యాలెస్ను తిలకించేందుకు ప్రజలకు అనుమతి ఇస్తామని , అనంతరం అందరి అభిప్రాయాలు తీసుకుని, జగన్ ఉల్లంఘలను వెల్లడిస్తామని అన్నారు. ప్యాలెస్లను దేనికి వాడుకోవాలో అర్థం కావడం లేదని వెల్లడించారు. రాజకీయ ముసుగులో తప్పులు చేసి ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.