అమరావతి : జనసేన అధినేత పవన్కల్యాణ్కు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) గురువారం లేఖ రాశారు. ‘ మీరు వస్తానని చెప్పించి, రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు.. రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను ’ అంటూ లేఖలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరనున్నారని, పవన్కల్యాణ్ (Pawan Kalyan) స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన నాయకులు రెండు నెలల కిందట వెల్లడించారు. అప్పటి నుంచి నేటి వరకు పవన్ గురించి ఎదురుచూసిన ముద్రగడ చివరకు గురువారం బహిరంగ లేఖ రాయడం సంచలనం కలిగించింది.
లేఖలో ఏముందంటే.. ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకుంటుంది. అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్దపడ్డా. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించా. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను. కాని దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదని అన్నారు.
చంద్రబాబు (Chandra Babu) జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడరు బయటకు రావడానికి భయపడి ఇళ్లకే పరిమితమైన సమయంలో మీరు జైలుకి వెళ్లి చంద్రబాబుకు భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదని పేర్కొన్నారు. మిమ్ములను ఉన్నతస్థానంలో చూడాలని జనాలను అనుకున్నారని తెలిపారు. పవర్ షేరింగు(Power Sharing) లో అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆ సాహసం మీరు చేయలేకపోవడం బాధాకరం అని వెల్లడించారు.
మీలాగ గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా.. తుప్పు పట్టిన ఇనుము లాంటివాడినిగా గుర్తింపు పడడం వల్ల మీరు నా వద్దకు రాలేదని భావిస్తున్నానని ఆవేదనను వ్యక్తం చేశారు.