AP Elections | అమరావతి, మార్చి 16: లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికల నగారా మోగింది. ఏపీ అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికల నాలుగో విడత జరిగే మే 13న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రోజున రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్లతో సహా 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. ఏపీలో ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య పోటీ నెలకొన్నది. 2014 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమిగా పోటీచేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తాజాగా పదేండ్ల తర్వాత మరోసారి జట్టు కట్టాయి. అధికార వైసీపీ దాదాపు 50 సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పుల తర్వాత శనివారం 25 లోక్సభ, 175 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎన్నికల్లో ప్రధానంగా తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఓట్లు కొల్లగొడుతాయనే ఆశ పెట్టుకొన్నది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో భారీ విజయం సాధించిన వైసీపీ.. ఈసారి వైనాట్ 175 అనే నినాదాన్ని ఎత్తుకొన్నది. మరోవైపు ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఈసారి వైసీపీకి ఘోర పరాభవం తప్పదని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు పవన్కల్యాణ్తో పాటు కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నది.