అమరావతి : ఏపీలో ఉపాధ్యాయ సంఘాల తీరుపై పీఆర్సీ సాధన సమతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో చేసుకున్న పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. గత మూడురోజులుగా ప్రభుత్వం, సాధన సమితి నాయకులకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు బాధ్యతరహితంగా మాట్లాడుతున్నాయని స్టీరింగ్ కమిటీ నేతలు బండి శ్రీనివాసులు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఆందోళనపై కొందరు ప్రభావితం చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు.
ఫిట్మెంట్ ఒక్కటే ప్రధానమన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడుతున్నాయని , ప్రభుత్వంతో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. చర్చలు జరుగుతున్నప్పుడు కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు చర్చల్లో పాల్గొన్నారని, అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడు చేయడం వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఫిట్మెంట్ తప్ప మిగతా డిమాండ్లన్నీ సాధించామని వారు తెలిపారు.
ఐఆర్ రికవరీ ఉండదని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు . సాధన సమితి నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేయడం విచారకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చని నిర్ణయాలకు నిరసన తెలపడానికి అనేక మార్గాలున్నాయని వెల్లడించారు. ప్రభుత్వంతో జరిపిన ఒప్పందాలపై అభ్యంతారాలుంటే ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టవచ్చని సూచించారు.తమ వల్లే నష్టపోయామనడం ఆరోపించడం ఉపాధ్యాయ సంఘాలకు సరికాదని తెలిపారు.
గొప్ప పీఆర్సీ ఇచ్చామని ప్రభుత్వం కూడా చెప్పడం లేదు, తాము కూడా ఫిట్మెంట్పై సంతృప్తి కరంగా లేమని అన్నారు. కాని చర్చల్లో అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు సాధించమని నాయకులు వెల్లడించారు.