అమరావతి : విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సందర్శించి అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియతో మాట్లాడుతూ కరోనా సమాజం నుంచి అంతమవ్వాలని స్వామివారిని కోరుకున్నానని ఆమె తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. అప్పన్న నిజరూప దర్శనం సంతోషంగా ఉందని వివరించారు .
ఏపీ ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా స్వామివారికి తొలి చందనం సమర్పించారు. చందనోత్సవం సందర్భంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి సత్యనారాయణ చెప్పారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అప్పన్నను దర్శించుకున్నారు. అప్పన్న చందనోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు.