Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా.. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏడోరోజు ఆదిదంపతులకు పూజాధికాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణాలు, రుద్రహోమం, చండీహోమం జరిపించామని ఈవో లవన్న తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల తర్వాత స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన గజ వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్లతో క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, రాజభటులు కోలాటాలు, వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. గజం అంటే ఐశ్వర్యానికి, అంగబలానికి, ఆధిపత్యానికి ప్రతీక. శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామి శ్రీలింగ మహాచక్రవర్తి. జయజయ ధ్వానాల నడుమ జగన్మాత భ్రమరాంబిక అమ్మతో కలిసి అధిరోహించి దర్శనమిచ్చాడు. గజవాహన సేవలో స్వామి అమ్మవార్లను దర్శించడం వలన ఐష్ట ఐశ్వర్యాలు కలిగి భక్తులకు కొండంత అండగా ఉంటానని అభయమిస్తున్నట్లు విశ్వసిస్తారు.
గజవాహన సేవలో స్వామిఅమ్మవార్లను దర్శించడంతో ఐష్టెశ్వర్యాలు కలిగి భక్తులకు కొండంత అండగా ఉంటానని అభయమిస్తున్నట్లు విశ్వసిస్తారు. గ్రామోత్సవంలో ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న, ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఈ రామకృష్ణ, ఏసీ వెంకటేశ్వర్లు, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీంధ్రప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయన్న, సూపరింటెండెంట్ రవి, స్వాములు, వెంకటేశ్వరులు,మధుసూధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయ మాడవీధిలోని భ్రామరీ కళావేదికతోపాటు పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద ఉదయం నుండి అర్థరాత్రి వరకు భక్తులు తిలకించేందుకు ఏర్పాటు చేసిన కూచిపూడి, భరతనాట్యం, కధక్, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు వంటి కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయని పీఆర్వో శ్రీనివాసరావు అన్నారు.
శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన మల్లన్న దంపతులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి కాలినడకతో వచ్చే భక్తులతోపాటు వాహనాలు ఆర్టీసీ బస్సుల్లో వస్తున్న వారి సంఖ్య లక్షకు పైగానే చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకుని మెక్కులు తీర్చుకునేందుకు బారులు దీరుతున్నారు.
వీఐపీ దర్శనాల కోసం క్యూలైన్లను నిలిపివేయడంతో సామాన్య భక్తులకు అలంకార దర్శనాల కోసం గంటల తరబడి కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి వస్తుందని యాత్రికులు వాపోయారు. అంతేకాక కాలినడకతో వచ్చిన యాత్రికులకు మోళిక వసతులు అరకొరగానే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడవలసి వచ్చిందని పాదచారులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ ఫుట్పాత్లు, రోడ్లు, డివైడర్లపై నిద్ర పోతున్నారు. ఉత్సవాలకు సరిపడా సిబ్బంది లేకపోడంతో వసతుల కల్పనకు కొంత ఇబ్బందులు పడవలసి వస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు సెల్ టవర్లు పూర్తిగా విఫలమవ్వడంతో యాత్రికులు సమాచారంతోపాటు అధికారులు కూడా అవస్థలు పడుతున్నారు.
ముడుపులు చెల్లించేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మాల విరమణ, ఇరుముడి సమర్పణలు చేయిస్తున్నారు. శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా అర్చకులు దీక్షా విరమణలు చేయిస్తున్నారు. యాత్రికులకు కల్పించిన వసతులను దుర్వినియోగ పరచకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని ఈవో లవన్న భక్తులను కోరారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల కళ్యాణానికి ముందుగా జరిగే పాగాలంకరణ కోసం వడికిన పాగ మల్లన్న సన్నిధికి చేరుకున్నదని ఈవో లవన్న తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు ప్రతిరోజు ఒక మూర చొప్పున నియమ నిష్టలతో వడికి మల్లన్న కళ్యాణం నాటికి సిద్దం చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ స్థానాచార్యులు పూర్ణానందారాద్యులు తెలిపారు. ఆలయ ప్రధాన గోపురాన్ని కలుపుకుంటూ నందీశ్వరులకు చుట్టే కమనీయ ఘట్టాన్ని పాగాలంకరణగా పిలుస్తారు.
శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలినడకన వస్తున్న భక్తుల కోసం కల్పించిన వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఉదయం కైలాస ద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి, క్షేత్రంలోని శివదీక్ష శిభిరాలు, పార్కులు, ఆరు బయలు ప్రదేశాలు, పుష్కరిణి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మంచినీరు, భోజనం, వైద్యశిబిరాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూసుకోవాలని, పారుశుద్ధ్యంలో అలసత్వం చూపవద్దని సూచించారు. అటుపై దేవస్థాన నిత్యాన్నదాన భవనంలో శివసేవకుల పనితీరు, అన్నప్రసాద తయారీలో నాణ్యతను ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి అడిగి తెలుసుకున్నారు. దేవస్థాన సిబ్బందితోపాటు సెక్యూరిటీ, శివసేవకులు ప్రతి ఒక్కరూ భక్తులతో మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శుక్రవారం సాయంత్రం ఆలయ ధర్మకర్తల మండలి తరుపున పట్టుపస్త్రాలు సమర్పించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 11 రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ధర్మకర్తల మండలి సభ్యులు స్వయంగా పట్టువస్త్రాలు, ఫల పుష్పాదులను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దంపతులు, ఈవో లవన్న, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులతోపాటు అధికారులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. కాగా, శనివారం శ్రీ భమరాంభికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లు నంది వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.