అమరావతి : వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.
కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రమణప్రసాద్, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కె.సత్యనారాయణ దంపతులు ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకున్నారు.