AP Liquor Policy | ఏపీ లిక్కర్ పాలసీపై కసరత్తు తుది దశకు చేరుకుంది. 2019 కంటే ముందున్న పాలసీనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనపై కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ పాలసీపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం సమావేశమవ్వగా.. ఈ నెల 17వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం కానుంది. ఈ నెల18న కేబినెట్ కొత్త లిక్కర్ పాలసీ ప్రతిపాదనలను ఉంచాలని నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు లిక్కర్ పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
మద్యం పాలసీపై ఇటీవల సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం.. గత ప్రభుత్వ మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా చేసిందని అభిప్రాయపడింది. కేవలం సొంత ఆదాయం పెంచుకునేందుకే మద్యం విధానం రూపొందించారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండికొట్టేలా మద్యం విధానం రూపొందించారని అన్నారు. గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని.. అందుకోసమే కొత్త లిక్కర్ పాలసీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.