అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 18 వరకు చేరుకుంది. మృత్యువాత పడ్డవారిలో కొందరిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో దవాఖానలో చేరడం.. గంటల వ్యవధిలో మృతి చెందడం మిస్టరీగా మారింది.
ఇవాళ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ ఒడిశా వాసి ఉపేంద్ర మృతి చెందగా గుంటూరు దవాఖానలో చికిత్సపొందుతున్న వరదరాజుల పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందజేస్తున్న వైద్యులు వెల్లడించారు . వరద రాజులు అవయవాలేవీ పనిచేయడం లేదని తెలిపారు. కాగా గ్రామంలో మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో వైద్యులు, అధికారులు గ్రామానికి వెళ్లి ఇంటింటా విచారణ జరుపుతున్నారు.
అయితే మృతుల్లో ఎక్కువమందికి మద్యం అలవాటు ఉందని, కల్తీ సారా తాగి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టణంలోని పలు కల్తీ సారా తయారి కేంద్రాలపై దాడులు నిర్వహించారు. నాటుసారా బట్టీలను ధ్వంసం చేశారు.