అమరావతి : అమరావతి రైతులు కొనసాగిస్తున్న మహా పాదయాత్రకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, ఎంపీ సీఎం రమేశ్, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో వారు ప్రసంగించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ అమరావతిలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటి వరకు కేంద్ర నిధులతో అమరావతిలో అనేక పనులు చేపట్టారని గుర్తు చేశారు. పురందేశ్వరి మాట్లాడుతూ అమరావతి రాజధానిపై బీజేపీది మొదట్నుంచి ఒకే విధానమని, పాదయాత్రలో లాఠీచార్జి చూసి బీజేపీ చలించిందని, అమరావతికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతపురం నుంచి అమరావతి రోడ్డు, ఎయిమ్స్ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. రైతులను పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని తెలిపారు.
కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజధానిగా అమరావతి ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని, ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ అమరావతి పరిరక్షణ సమితిలా ఆంధ్రా పరిరక్షణ సమితి ఏర్పాటు చేయాలని సూచించారు.