అమరావతి: ఆంధ్రప్రదేశ్లో విదేశి వనితపై జరిగిన లైంగిక దాడికేసును దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయాలని ఏపీ డీజీపీ జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం లిథూవేనియా దేశానికి చెందిన 27 ఏళ్ల మహిళపై ఇద్దరు నిందితులు ఆమెపై లైంగిక దాడికి యత్నించారు.
చెన్నై నుంచి బెంగళూరు మీదుగా గోవాకు బస్సులో బయలు దేరిన విదేశి వనిత వద్ద బస్సులో విదేశి కరెన్సీ చెల్లని కారణంగా మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్న పాళేనికి చెందిన ఇంగిలాల సాయికుమార్ అనే వ్యక్తి ఆమె తరుఫున రూ.720 కండక్టర్కు డబ్బులు చెల్లించి ఆమె వద్ద నుంచి రూ.5వేలు కరెన్సీని తీసుకుని ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఆమె మిగతా డబ్బుల కోసం అడుగగా స్వగ్రామంలో ఇస్తానని తీసుకెళ్లాడు. అక్కడ అతడి స్నేహితుడు గూడురు నివాసానికి చెందిన షేక్ అబీద్కు విదేశి మహిళ గురించి వివరించగా ఇద్దరు కలిసి ఆమెను పరిసర ప్రాంతాలు చూపించేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. రావూరు అటవీ ప్రాంత సమీపంలో ఇద్దరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించి రోడ్డుపైకి చేరుకోగా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆమెను సైదాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు.
బాధితురాలు సెల్ఫోన్లో తీసిన వీడియో ఆదారంగా పోలీసులు సంఘటన జరిగిన నాలుగు గంటల్లోనే నిందితులను గుర్తించి పట్టుకున్నారు . ఈ సంఘటనపై స్పందించిన డీజీపీ కేసును వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.