తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణాన్ని నిర్వహించారు. కొవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, అనంత, గరుడ, విష్వక్సేనుల వారిని, గరుడ పటాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. శేషాచార్యులు కంకణబట్టార్గా వ్యవహరించారు.
కొవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం
తెలిపారు. ఫిబ్రవరి 24న గరుడసేవ జరుగనుందని, ఫిబ్రవరి 28న ధ్వజావరోహణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
భక్తుల కోసం తిరుమల శ్రీవారి లడ్డూలు
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి లడ్డూలను ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రోజుకు 5 వేల చొప్పున లడ్డూలను భక్తులకు విక్రయించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శాంతి, వైఖానస ఆగమ సలహాదారు విష్ణుభట్టాచార్యులు, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, విఎస్వో మనోహర్, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.