అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలను నిలబెట్ట వచ్చు, కూల్చవచ్చని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు వైఎస్ జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ, తదితర విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి ఉద్యోగులంతా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆదివారం సమ్మె నిర్వహణపై ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘ నేను విన్నాను. నేను ఉన్నాను అనే జగన్ మాటలకు నమ్మి ఉద్యోగులంతా కలిసి వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టి తప్పుచేశామని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగి కుటుంబంలో 5 ఓట్లు ఉన్నా.. సుమారు 60 లక్షల ఓట్లతో ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. ప్రభుత్వాన్ని నిలబెట్టనూ వచ్చని పేర్కొన్నారు. ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందేని స్పష్టం చేశారు. ఏపీలో ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆదారపడిలేమని, ఉద్యమం ద్వారానే హక్కులను సాధించుకుంటామని అన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వక ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.