అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టిదిద్దుకునేందుకే లండన్ వెళ్లారని టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభిరామ్ విమర్శించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో అక్రమంగా కూడబెట్టిన డబ్బు కోసం లండన్ వెళ్లాడని ఆరోపించారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. సీబీఐ కోర్టు సీఎం దావోస్ వెళ్లడానికి మాత్రమే అనుమతినివ్వగా కోర్టు అనుమతులను పక్కనబెట్టి లండన్ ఎలా వెళ్లారని ప్రశ్నించారు.
దావోస్కు అధికారులతో వెళ్లలేదని ఖరీదైన విమానంలో కేవలం భార్యతో సహ వీఎన్ భరత్రెడ్డి అనే మరొకరితో వెళ్లారని ఆరోపించారు. వారం రోజుల పర్యటనకు దాదాపు రూ.9 కోట్లు విమానప్రయాణానికే ఖర్చు కానుందని పేర్కొన్నారు. ఇస్తాంబుల్లో రీఫిల్లింగ్కు జాప్యం కావడం వల్లే లండన్ మీదుగా ప్రయాణం కొనసాగించారని ఏపీ మంత్రులు చేసిన ప్రకటన అసత్యదూరమని అన్నారు.
2019 ఎన్నికలకు ముందు లండన్ వెళ్లి సూట్కేసు కంపెనీలు, సెల్ కంపెనీలు, మనీ ల్యాండరింగ్ కంపెనీల్లో దాచుకున్న సొమ్మును తెచ్చుకున్న విధంగా ముందస్తు ఎన్నికలకు సమాయత్తం కావడానికి మరోసారి దొడ్డిదారిన లండన్ వెళ్లారని విమర్శించారు.