అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 64.23 శాతం ఉత్తీర్ణత లభించింది. సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రంలో 1,91,846 విద్యార్థులు హాజరు కాగా.. 1,23,231 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 60.83 శాతం, బాలికలు 68.76 శాతం పాసయ్యారు. ప్రకాశం జిల్లా అత్యధికంగా 87.52 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అతి తక్కువగా పశ్చిమ గోదావరి జిల్లలో 46.66 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ఇలాఉండగా, మరోసారి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇదే చివరిసారి అని ఆయన చెప్పారు. విద్యార్థులు కూడా సక్రమంగా చదువుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల విలీనం చేయలేదని, కేవలం తరగతుల గదులను మాత్రమే విలీనం చేసే పనులు చేపట్టామని బొత్స తెలిపారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, చదువులతో పాటు ఆటలు, ఇతర అంశాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.