విజయవాడ: తమ ప్రధాన డిమాండ్ సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. రేపు ఛలో విజయవాడ చేపట్టడం ద్వారా ఉద్యోగుల ఐక్యత ఏంటో ప్రభుత్వానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఛలో విజయవాడకు గానీ, సభకు గానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయవాడ అంతటా ఆంక్షలు విధించారు. పలు జిల్లా కేంద్రాల్లో నాయకులను హౌజ్ అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఛలో విజయవాడకు వెళ్లొద్దని ఇప్పటికే పలువురు ఉద్యోగ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలిసింది.
ఉద్యోగుల ఆందోళనతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. కొవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో ఛలో విజయవాడకు విజయవాడ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాను కలిసిన పీఆర్సీ సాధన సమితి నేతలు తమ సభకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున అనుమతి ఇవ్వలేమని వారికి సీపీ స్పష్టం చేసినట్లు సమాచారం. దాంతో అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ చేపట్టాలని పీఆర్సీ సాధన సమితి కమిటీ నేతలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది.
ఇప్పటికే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం స్టాండ్ ఏంటో సీఎం జగన్ అధికారులతో జరిపిన ఇవాల్టి వర్చువల్ సమావేశంలో స్పష్టం చేశారు. మరోవైపు ఉద్యోగులు రేపు బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. అన్ని కూడళ్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బీఆర్టీఎస్ రోడ్డుపై వాహనాల రాకపోకలపై పోలీసులు నిషేధం విధించారు. మరోవైపు అవసరమైతే తప్ప ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని ప్రభుత్వం అన్ని కార్యాలయాలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.