అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు పెట్టిన జాతీయ నాయకుల పేర్లపై వివాదం చెలరేగుతుంది. కొనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ జిల్లాలోని అమలాపురంలో యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట , ఘర్షణ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ రాళ్ల దాడి నుంచి ఎస్పీ సుబ్బారెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఎస్పీ, డీఎస్పీ గన్మెన్లకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కలెక్టరేట్కు అడ్డంగా పెట్టిన పోలీసు జీపును ధ్వంసం చేశారు. పట్టణంలో ముందస్తుగా 144 సెక్షన్ను విధించినా పట్టించుకోకుండా కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ యువకులు రోడ్లపైకి గుంపులుగా తరలివచ్చి నిరసనలు తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన జిల్లా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ అంబేద్కర్ పేరును అన్ని పార్టీలు అంగీకరించాయని అయితే కొన్ని పార్టీలు ధ్వంద వైఖరిని అవలంభిస్తూ స్థానికులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.