గుంటూరు : సత్తెనపల్లి మండలం కోమెరపూడకిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. టీడీపీ ర్యాలీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కారు ధ్వంసమైంది. పలువురు గాయపడ్డారు.
కోమెరపూడి గ్రామంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు ఏర్పాటుచేశారు. ఈ విగ్రహావిష్కరణ కోసం ప్రత్తిపాటి పుల్లారావు ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీ జరుగుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో పుల్లారావు కారు కొద్దిగా ధ్వంసమైంది. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు వర్గీయులే ఈ దాడికి పాల్పడి ఉంటారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
తమవైపు ప్రజలు వస్తుండటాన్ని జీర్ణించుకోలేని చేతగాని వ్యక్తులు తమపై రాళ్తు వేశారని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. మేమే ఇలాంటి పనులు చేసి ఉంటే జగన్ పాదయాత్ర జరిగి ఉండేదా.. అని ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. రాళ్ల దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. చంద్రబాబు చెప్పినా వారిని విడిచిపెట్టేది లేదని, ప్రతీకారం తీర్చుకుని తీరుతామని హెచ్చరించారు.