విశాఖపట్నం: మరోసారి అన్న క్యాంటీన్ ఏర్పాటు ఆందోళనకు దారితీసింది. కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్) వద్ద ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను టీడీపీ ఏర్పాటు చేస్తున్నది. మరోవైపు వైసీపీ నేతలు క్యాంటీన్లు ఏర్పాటుచేయకుండా అడ్డుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. తాజాగా విశాఖ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ కేజీహెచ్ వద్ద టీడీపీ అన్న క్యాంటీన్ నెలకొల్పేందుకు సిద్ధపడింది. అయితే, అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పి ప్రారంభించకుండా అడ్డుకున్నారు. దాంతో పోలీసులు-టీడీపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ నాయకుడు గండి బాబ్జి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు.
గతంలో కేజీహెచ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ప్రాంతంలోనే పేదలు, రోగులకు భోజనం అందించేదుకు ఏర్పాట్లు చేయగా పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ను ప్రారంభిస్తే ప్రభుత్వానికిగానీ, వైసీపీ కార్యకర్తలకు గానీ వచ్చిన నష్టమేంటో అర్ధం కావడంలేదని గండి బాబ్జి అన్నారు. క్యాంటీన్ స్థలంలో భోజనం అందించేందుకు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పంపిణీ చేసినట్లు బాబ్జి తెలిపారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, నిరుపేదలకు భోజనం పెట్టేందుకు కూడా అనుమతి కోరడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు.