అమరావతి : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతుంది. నిన్న పోతులూరు గ్రామంలో ఒక గేదెను చంపగా ఇప్పటివరకు పులి దాడిలో పది గేదెలు మృతి చెందాయని గ్రామస్తులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న అటవి అధికారులు, సిబ్బంది గ్రామానికి వెళ్లి వివరాలను సేకరించారు. పులిని బంధించేందుకు సుమారు 120 మంది అటవి సిబ్బంది సమీప ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి బోన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సమీప గ్రామంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో పులి సంచారాన్ని గుర్తించారు. కొన్ని రోజులుగా పులి సంచారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పులి భయం కారణంగా రాత్రి కాగానే గ్రామస్తులంతా ఇళ్ల తలుపులను మూసివేసుకుంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం గ్రామస్తులు గుంపులు, గుంపులుగా తిరుగుతున్నారు.